సీఎం జగన్ ఇప్పుడు నాలుగో స్థానంలో ఉన్నారు.. త్వరలోనే ఫస్ట్ ప్లేస్ లోకి వెళ్తారు: అవంతి శ్రీనివాస్

  • దేశంలోనే అత్యున్నత సీఎంగా జగన్ అవతరిస్తారు
  • జగన్ ను చంద్రబాబు ఎదుర్కోలేరు
  • చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా రాజకీయాలు చేస్తున్నారు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పనితీరుపై మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రశంసల జల్లు కురింపించారు. అత్యుత్తమ సీఎంల జాబితాలో జగన్ నాలుగో స్థానంలో ఉన్నారని చెప్పారు. ఏడాది పాలనలోనే నాలుగో స్థానాన్ని సాధించి, అందరిచేత ప్రశంసలు అందుకున్నారని... త్వరలోనే దేశంలోనే అత్యున్నత ముఖ్యమంత్రిగా తొలి స్థానంలో నిలుస్తారని తెలిపారు.

జగన్ ను టీడీపీ అధినేత చంద్రబాబు ఎదుర్కోలేరనే విషయం అర్థమైపోయిందని ఎద్దేవా చేశారు. ట్విట్టర్, ఫేస్ బుక్, జూమ్ ద్వారా చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. జగన్ ఎంత బలంగా కొడితే ... అంత బలంగా పైకి లేచే నాయకుడని అన్నారు.

కరోనా వైరస్ గురించి మంత్రి మాట్లాడుతూ, వ్యాక్సిన్ వచ్చేంత వరకు ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని కోరారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని... శానిటైజర్, మాస్కులు తప్పనిసరిగా వినియోగించాలని విన్నవించారు. టీడీపీ నాయకులు ప్రజాప్రతినిధులుగా గెలిచిన తర్వాత ప్రజలకు కనిపించరని... వైసీపీ నేతలు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని చెప్పారు.

Avanthi Srinivas
YSRCP
Jagan
Chandrababu
Telugudesam

More Telugu News